Sampoorna Ramayanam Part 30 | సంపూర్ణ రామాయణం - 30 వ రోజు | రావణుడి పరుష వాక్కులు
Sampoorna Ramayanam Part 30 | సంపూర్ణ రామాయణం - 30 వ రోజు | రావణుడి పరుష వాక్కులు
🚩 సంపూర్ణ రామాయణం - 30 వ రోజు🚩
ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏
ఓం ఆంజనేయాయ నమః 🙏
కథా వివరణ
శింశుపా వృక్షం కింద ఉన్న సీతమ్మను చూసిన హనుమ. ఆమె చుట్టూ ఉన్న రాక్షసులను చూసాడు.వారు అతి ఘోరంగా ఉన్నారు. ఒకత్తేకు ఒక కన్ను, ఒకత్తే కు ఒక చెవి,ఒక కాలు, నుదుటి మీద కన్ను, చేతులు పొట్టలో ఉన్న వికృత రూపిణీ లుగా ఉన్నారు.వారిలో ఎక్కువ మంది వళ్ళంతా మాంసం, రక్తం పులుము కొని భయంకరంగా ఉన్నారు.
సీతమ్మ ను చూసినందుకు ఆనందాశ్రువులు కార్చాడు హనుమ. అశోక వృక్షం మీద ఉండి సీతమ్మను పరిశీలించటం లో ఆ రాత్రి గడించింది(సూర్యాస్తమయం కి వెతకటం మొదలు పెడితే తెల్లవారు జామున రమా రమి 3:30 - 4:30 మధ్య సీతమ్మ దర్శనం అయింది అనుకోవచ్చు అది బ్రహ్మ ముహూర్తం సాధనలు సిద్ధించే కాలం)
రావణుడి పరుష వాక్కులు.
వంది మాగదుల గానాలాపనల మధ్య సూర్యోదయానికి పూర్వమే రావణుడు మేల్కొన్నాడు.లేస్తూనే సీతమ్మ పట్ల ఇంద్రియ లాలస అణుచుకోలేక, వంద మంది స్త్రీలు చామరలు వీస్తూ కలశాలు, రాజ చిహ్నాలు ధరించి వాడి వెంట రాగా ముందు రాత్రి స్వీకరించిన మద్య ప్రభావంలోనే తూలుతూ శింశుపా వృక్షం వైపు వచ్చాడు. రావణుడు రావడం చూసి హనుమ కొమ్మల చాటున దాక్కున్నాడు.కటిక నేల మీద కూచుని ఉన్న సీతమ్మ తన దేహం మొత్తం కప్పుకుని, తీవ్రంగా వణికి పోతూ, కన్నీరు కారుస్తూ వెనక్కి జరిగింది. భీతితో ఎగిరి పోతున్న పక్షి వలె ఉంది అంటారు వాల్మీకి మహర్షి.
రావణుడు వచ్చి ప్రలోభ పెట్టీ లొంగదీసుకునే ఆశతో నానా ప్రేలాపనలు పేలుతాడు(వాడి మాటలు రాయడానికి కూడా నాకు బుద్ధి పుట్టడం లేదు). వాడంటాడు పరసతులను అపహరించడం రాక్షస సంప్రదాయం. ధర్మం నేను ధర్మత్ముణ్ణి అంటాడు(ఇదే పతనం చెందే వాడి స్తితి తాను తప్పు చేస్తూ కూడా అది తప్పు కాదు అని వాదిస్తాడు,పైగా దాన్ని గొప్పగా చెప్పుకుంటాడు).
ఇంకా ఎన్నో మాటలు అంటాడు. రాముడు గడ్డి పరక తో సమానం అంటాడు.
సీతమ్మ ధర్మ బోధ
సీతమ్మకు అసలు వాడి మొహం చూడటం కూడా ఇష్టం లేదు అందుకు ముఖం వీపు చూపిస్తూ తిప్పుకుని మద్యలో గడ్డి పరక పెట్టీ.నీవు నన్ను ఎన్నటికీ పొందలేవు."నీవు ధర్మమార్గం నుండి వైదొలగి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నావు కనుక నీ యావత్ రాజ్యానికి నీవు వినాశహేతువు అవుతావు. తమ సతులను,పరసతులను సంరక్షించే సజ్జనుల ఆదర్శాన్ని ఎందుకు అనుసరించవు? స్వీయపత్ని పట్ల అసంతృప్తి చెంది పరపత్నులతో ఆనందాన్ని వాంఛించేవాడికి వినాశనం తథ్యం.బుధజనుల సలహాను పెడచెవిన పెట్టి శ్రేయస్కరమైనదానిని తిరస్కరిస్తావెందుకు? నీకు చెప్పేవాడు లేడా? చెపితే వినవా? సకల రాక్షసావళికి వినాశనం కలిగించాలని ఎందుకు నిశ్చయించావు? దుష్టుల వినాశనానికి ప్రతి ఒక్కరు ఆనందిస్తారని నీకు తెలియదా? నన్ను రామునికి అప్పగించి ఆయనను శరణు వేడు బతికి పోతావు.లేదా రామ లక్ష్మణుల శర పరంపరలో నేడు రేపో చావడానికి సిద్ధంగా ఉండు అని బదులిచ్చింది.
దాంతో వాడు మరింత రెచ్చి పోయి నీకిచ్చిన గడువులో పది నెలలు గడిచాయి మిగిలింది రెండు నెలలే అప్పటికి ఒప్పుకోక పోతే నీవు నాకు ఆహారం అవుతావు అంటూ సీతమ్మ మీదకు వెళ్ళ బోయాడు చుట్టూ ఉన్న స్త్రీలు ఆపి సీతమ్మకు కూడా కొందరు దైర్యం చెప్పారు.అలా ఉత్సాహాన్ని పొందిన సీత రావణుణ్ణి తిరిగి ఇలా మందలించింది "నీకు చేటు తెచ్చే ఈ నీచకార్యం నుండి నిన్ను ఈ క్షణమే భస్మీపటలం చేయగలను కాని రాముని నుంచి అలాంటి ఆజ్ఞ రానందున నేను ఆ పనిచేయకుండా ఉన్నాను. నీవు మూర్ఖుడవు. ఎందుకంటే శ్రీరాముని పత్నిని అపహరించటమనేది అసాధ్యకార్యం. నీ మృత్యువుకు నీవే తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నావు.బహుశా నన్ను అలా ఉపయోగించాలని దైవం నిర్ణయించి నందువల్లనే నీవా పని చేయగలిగావు."అని పలికింది.
పక్కన ఉన్న స్త్రీలు వాడి దృష్టి మరలేల చేయడం తో వాడు రాక్షస స్త్రీలకు ఏదో ఒకటి చేసి ఒప్పించండీ అని ఆదేశించి వెళ్ళిపోయాడు.వారు కూడా ఎంతో భయ పెట్టారు సీతమ్మను.హా రామ,హా లక్ష్మణ అంటూ విలపించింది తల్లి.మృత్యువు అయినా రాదేమి అని తలచింది.
త్రిజట స్వప్నం:
అప్పుడు వారిలో ధర్మాత్మురాలైన 'త్రిజట' (విభీషణుని కుమార్తె) మేల్కొని,తనకు వచ్చిన ఒక అద్భుతమైన కల గురించి వివరిస్తుంది. ఆ కలలో రాముడు లంకా నగరాన్ని జయించి, రావణుడిని సంహరించి,సీతమ్మన తీసుకువెళ్ళినట్లుగా చూశాను అని చెబుతుంది.ఇదే నిజం అయితే నిన్ను నా భర్త ఆగ్రహం నుండి రక్షిస్తాను అంటుంది సీతమ్మ.కానీ అంతలోనే రాక్షసుల భయం తో దుఃఖం లో కి వెళ్ళింది.ఈ వ్యధను భరించే కంటే శరీరం విడవడం ఉత్తమం అని శిరోజాలు మెడకు బిగించి,రెండవ కొస వృక్ష శాఖకు కట్టే ప్రయత్నం చేసిందిఅంతలోనే సీతమ్మకు ఎడమ కన్ను,ఎడమ తోడ,బుజం అదురుతాయి ఇది శుభ శకునం.
హనుమ రామకథ వినిపించుట:
శింశుపా వృక్షంపై ఆకుల్లో దాక్కున్న హనుమంతుడు ఇదంతా గమనిస్తాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్న ఆ తల్లిని ఓదార్చడానికి ఇదే సరైన సమయమని భావిస్తాడు. కానీ, వానర రూపంలో ఒక్కసారిగా ఆమె ముందుకు వెళితే రావణుడు మాయా రూపంలో వచ్చాడని భయపడుతుందని గ్రహిస్తాడు.
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Post a Comment