ముగ్గురు మిత్రులు | True Happiness అంటే ఏమిటి? | Best Telugu Moral Story
ముగ్గురు మిత్రులు | True Happiness అంటే ఏమిటి? | Best Telugu Moral Story
ఒక గ్రామంలో రాముడూ, భీముడూ, సోముడూ అని ముగ్గురు స్నేహితు లుండేవాళ్ళు. వాళ్ళకు చదువు సంధ్యలూ, సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులూ ఉండేవి. అయినా వాళ్లు తృప్తిచెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు.
అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకరారణ్యంలో ఒక ముని ఉన్నాడనీ, ఆయనను దర్శించినట్టయితే, అంతులేని సంపదగల గుహకు ఆయన దారి చెబుతాడనీ వారికి తెలిసింది.
వెంటనే మిత్రులు ముగ్గురూ బయలుదేరి భయంకరారణ్యంలోకి ఎన్నో బాధలుపడుతూ ప్రయాణంచేసి, ముని ఆశ్రమం కనుక్కుని,
ఆయనకు ప్రణామంచేసి,
గుహకు దారి ఆడిగారు. ముని వారితో,
"నాయనలారా, ఆ గుహకు వెళ్ళడం మాటలుకాదు. దారిలో భయంకర క్రూరమృగాలున్నాయి. గుహ లోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి,
రేపు ఏమి చేయాలో నిర్ణయించుకోండి." అంటూ ముగ్గురికీ మూడు కుటీరాలు చూపించాడు. వాళ్ళకు సపర్యలు చెయ్యటానికి ముగ్గురు అప్సరసలలాటి మునికన్యలు నియోగించబడ్డారు.
రాముడూ, భీముడూ తమకు సేవలు చేసిన స్వయంప్రభనూ, రత్నమాలనూ చూసి ముగ్ధులై,
వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయనీ,
ధనం కోసం గుహకు వెళ్ళి,
దారిలో క్రూరమృగాల వాతపడటం మతిమాలిన పని అని తేల్చుకుని,
మర్నాడు మునితో ఆ మాట చెప్పారు. ముని సరేనని రాముడికి స్వయంప్రభనూ,
భీముడికి రత్నమాలనూ ఇచ్చి,
తన దగ్గిర ఉన్న కొన్ని మణులుకూడా ఇచ్చి వాళ్ళను మరింత ఆనందపరచి పంపేశాడు.
సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే, అయితే ఆమె సోముడి మనసును బలంగా ఆకర్షించ లేదు. అతని మనసు గుహలోని రత్న రాసుల మీదే ఉన్నది.
ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్ళేదారి చెప్పి, "జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో." అని హెచ్చరించాడు.
సోముడు క్షేమంగానే గుహకు చేరాడు. అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవీ తటస్థపడలేదు. అతను గుహ నుంచి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకుని,
తన గ్రామానికి తిరిగి వెళ్ళక,
నగరంలో పెద్దభవంతి కట్టించి,
దాసదాసీజనంతో రాజవైభోగంగా జీవించసాగాడు.
కొంతకాలం ముగ్గురూ తృప్తిగానే జీవించారు. అయితే రాముడిలోనూ, భీముడిలోనూ అసంతృప్తి తలఎత్తింది. భీముడి భార్య తన భార్యకన్న అందమైనదిగా రాముడికి తోచింది. రాముడి భార్య తన భార్యకన్న అందమైనదిగా
భీముడికి తోచింది.
ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకుని, "మనకన్న సోముడు అదృష్టవంతుడు. వాణ్ణి ఒకసారి చూసి వద్దాం." అనుకున్నారు.
వాళ్ళు వెళ్ళేసరికి సోముడి ఇల్లు రాజభవనం లాగున్నది. అక్కడి దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు. అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు.
రాముడూ, భీముడూ ఒక వారం రోజులు సోముడితో గడిపి, "మేం ముని ఆశ్రమానికి పోతున్నాం. అక్కడ మాకు కొంచెం పని ఉంది,"
అన్నారు. సోముడు తాను కూడా వస్తాననీ,
తనకూ మునితో పని ఉందనీ అన్నాడు.
ముగ్గురూ కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముని ముగ్గురి ముఖాలలోనూ అసంతృప్తి గమనించి, వారికి వేరు వేరు కుటీరాలిచ్చి, ఒక్కొక్కరినీ విడిగా కలుసుకుని ప్రశ్నించాడు.
రాముడు ఆయనతో, "మీరు నన్ను గుహకు వెళ్ళకుండా భయపెట్టారు. అందమైన రత్నమాలను భీముడికీ,
సామాన్యమైన స్వయంప్రభను నాకూ ఇచ్చారు,''
అన్నాడు.
ముగ్గురు మిత్రులు | True Happiness అంటే ఏమిటి? | Best Telugu Moral Story
భీముడు కూడా, సోముడికి లాగా తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించీ, స్వయంప్రభలాటి అందగత్తె గాక, సామాన్యమైన రత్నమాల తనకు భార్యకావడం గురించి తన అసంతృప్తి వెలిబుచ్చాడు.
సోముడు, "మునీశ్వరా, సంపద నాకు సుఖమూ,
శాంతీ లేకుండా చేసింది. నా కున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడినవారే. గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు?
నా జన్మకు అర్థంలేకుండా పోయింది,''
అన్నాడు.
ముని ముగ్గురినీ ఒకచోట చేర్చి, "మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు. మీలో ఎవరినీ నేను గుహకు పోవద్దనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కాని మీకు సంతృప్తిలేదు. మీకు కావలసినది సంతృప్తే అయితే,
మీకు ఉండినదానితోనే సంతృప్తిపడి ఉండవచ్చు. నా దాకా రానవసరంలేదు. ఇప్పటికైనా మించిపోలేదు. మీ మనసులు మార్చుకుని ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకోండి.'' అన్నాడు.
తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడూ, భీముడూ తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు తనకు నచ్చిన భార్యను పెళ్ళాడి,
రాజవైభోగాలకు స్వస్తిచెప్పి సామాన్యుడిలాగా జీవించసాగాడు.
-వసుంధర
Moral of the story:
"Be happy with what you have. Contentment is the real wealth." 💖
మనకు ఉన్నదానితో సంతోషంగా జీవిస్తే... అదే నిజమైన ఆనందం, అదే నిజమైన సంపద.
మరిన్ని చందమామ కథల కోసం మన చందమామ కథలు-Chandamama
story books పేజీ ని follow చేయండి.
Post a Comment