పరాయి సొత్తు (Parayi Sottu) – Other's Wealth Telugu Moral Story | నిజాయితీ కథ
Dear All TeluguLoStories Readers we will find here the best Moral Story | పరాయి సొత్తు (Parayi Sottu) – Other's Wealth Telugu Moral Story | నిజాయితీ కథ | లక్ష్మయ్య, రామయ్య కథ ద్వారా నిజాయితీ, పరాయి సొత్తు విలువ తెలిపే హృదయస్పర్శి తెలుగు నీతి కథ. చదవండి పరాయిసొత్తు – Telugu Moral Story on Honesty.
చీకటి పడి పెద్దగా వర్షం ప్రారంభమయింది. అప్పుడే భోజనం ముగించిన లక్ష్మయ్య వీధి తలుపు మూయటానికి వెళ్లి, వీధి అరుగుమీద నిలబడి ఉన్న మనిషిని చూశాడు. ఆ మనిషి వానకు తడిసి, తన బట్టతలను పొడి బట్టతో తుడుచుకుంటున్నాడు. అతని చంకలో ఒక బట్టల మూట ఉన్నది. అతని కుడి చేతికి ఆరో వేలు ఉన్నది.
లక్ష్మయ్య ఆ మనిషిని పోల్చుకుని, " బాగా తడిసినట్టున్నారు. లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి!" అని అతన్ని ఆహ్వానించాడు.
''కృతజ్ఞుణ్ణి!'' అంటూ ఆ మనిషి లోపలికి వచ్చాడు. అతని బట్టలు చూస్తే చాలా పేదవాడిలాగా కనిపించాడు. అతను లోపలి గదిలో బట్టలు మార్చుకుని, తడి బట్టలు ఆరవేస్తూండగా, వంటగది సర్ది ఇవతలికి వచ్చిన మంగమ్మ అతన్ని చూసింది. ఆమె తన భర్తను లోపలికి పిలిచి, "దారిన పొయ్యే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నావా ? హవ్వ! '' అంటూ బుగ్గలు నొక్కుకున్నది.
"దరిద్రుడైతేనేం? అతను మనకు అతిథి! వంట ప్రారంభించు." అన్నాడు లక్ష్మయ్య భార్యతో.
" ఇది మరీ బాగుంది! లోపలికి ఆహ్వానించింది చాలక విందు కూడానా? వర్షం కాస్త నిలవగానే ఆ దరిద్రుణ్ణి సాగనంపు!" అన్నది మంగమ్మ.
భార్య నస భరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్లి బయటికి చూస్తే, వాన తగ్గే లక్షణాలు కనిపించలేదు. అతను మళ్లీ భార్య వద్దకు తిరిగివచ్చి, "వాన తగ్గేటట్టు లేదు. తిండి పెట్టకపోతే మానే, చాప ఇచ్చి పడుకోమందాం! '' అన్నాడు.
''అదేమీ కుదరదు! అడ్డమైనవాళ్లకూ ఆశ్రయమిస్తే ఇల్లు దోచుకుపోతారు!" అన్నది మంగమ్మ.
"ఆ మనిషి ఎవరో తెలిస్తే నువు ఆ మాట అనవు." అంటూ లక్ష్మయ్య తన పెళ్ళికి పూర్వం జరిగిన సంగతులు మంగమ్మకు చెప్పాడు.
లక్ష్మయ్య చిన్నతనమంతా చదువూ, సంధ్యా లేకుండా గడిపి, గాలికి తిరిగి, ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఎందుకూ పనికి రాకుండా తయారయాడు. వాడి స్నేహితులందరూ పనికిమాలినవాళ్ళే. వాడికి ఉద్యోగం ఎవరూ ఇయ్యరు గనక, వ్యాపారం చేస్తానంటూ, పెట్టుబడికి డబ్బు ఇయ్యమని తండ్రిని అడిగాడు. తండ్రి ఇయ్యలేదు. ఒక స్నేహితుడి ప్రేరణతో లక్ష్మయ్య ఇంటి నుంచి రెండు వేల రూపాయలు దొంగతనం చేసి, ఇంకో ఊరు వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడు వాడి చేత ఏదో వ్యాపారం చేయించబోతున్నట్టు నటించి, ఆ డబ్బు కాజేసి, లక్ష్మయ్యను కట్టుబట్టలతో వదిలాడు.
తనకోసం తండ్రి వస్తున్నట్టు లక్ష్మయ్యకు తెలిసింది. వాడు ఆ ఊరు వదిలి పెట్టి అడివి దారిన ప్రయాణంసాగించాడు.
ఒక కొండవాగు దగ్గిర ఒక మనిషి, స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు. అతని తల బట్టతల, అతని కుడిచేతికి ఆరు వేళ్ళు!
ఆ మనిషి వెనకగా గట్టు మీద ఒక పెట్టె ఉన్నది. ఆ మనిషి తనను చూడ లేదని తెలుసుకుని లక్ష్మయ్య ఆ పెట్టెను తీసుకుని వచ్చిన దారి పట్టాడు. కొంత దూరం వచ్చి చూసుకుంటే ఆ పెట్టెలో సగందాకా బంగారు కాసులు ఉన్నాయి.
లక్ష్మయ్య పరమానందం చెంది, ఇంటికి చేరుకుని, తండ్రికి బంగారు కాసులు చూపి, “ ఇదుగో, నేను సంపాదించిన డబ్బు!" అన్నాడు.
"నువు చేసిన వ్యాపారం ఏమిటి?'' అని తండ్రి అడిగాడు, అనుమానంగా.
"అదేమీ అడగవద్దు! ఈ డబ్బుతో నేను ఇక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను,'' అన్నాడు లక్ష్మయ్య.
లక్ష్మయ్యకు వ్యాపారం కలిసివచ్చింది. ఏడాది తిరగకుండానే అతను మంగమ్మను పెళ్ళి చేసుకుని, పైకి వచ్చాడు.
ఇదంతా భార్యకు చెప్పి, '" ఇప్పుడు మనం అనుభవిస్తున్న భోగం అంతా ఇతని చలవే! అతను మనకు దేవుడు !'' అన్నాడు లక్ష్మయ్య.
"ఆ డబ్బు అతనికి ప్రాప్తంలేదు. అతన్ని వెంటనే వెళ్ళగొట్టకపోతే మొదటికే మోసం వస్తుంది!" అన్నది మంగమ్మ ఆందోళనతో.
లక్ష్మయ్య అంత వర్షంలో అతన్ని పోమ్మనలేక పోయాడు; అతనికి పడుకునేటందుకు ఒక చాప ఇచ్చి, మాటల సందర్భంలో అతని పేరు రామయ్య అనీ, అతను ఒక కోమటి గుమాస్తా అనీ తెలుసుకున్నాడు.
అతిథిని తన సలహా ప్రకారం వెళ్ళ గొట్టనందుకు మొగుణ్ణి అనవలసిన మాటలన్నీ అని, మంగమ్మ నిద్రపోయింది. కాని లక్ష్మయ్యకు నిద్ర పట్టలేదు. రామయ్య కటిక దారిద్య్ర్యంలో ఉన్నాడు! అతనికి తాను ఏదన్నా సహాయం చెయ్యాలి!
" చాలాసేపు ఆలోచించి, లక్ష్మయ్య అయిదువేల రూపాయలు మూటగట్టి, రహస్యంగా దాన్ని రామయ్య బట్టల మూటలో పెట్టి, నిశ్చింతగా నిద్రపోయాడు.
తెల్లవారగానే రామయ్య లక్ష్మయ్యకు తన కృతజ్ఞత తెలుపుకుని సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అయితే అతను మధ్యాన్నానికల్లా మళ్ళీ వచ్చి, "ఇది నా బట్టల మూటలోకి ఎలా వచ్చిందో, వచ్చింది! ఎందుకు వచ్చిందో నాకు తెలీదు! మీ ఇంట్లోనే ఇది వచ్చింది గనక, దీన్ని మీరు తీసుకోండి." అంటూ లక్ష్మయ్య డబ్బుమూట లక్ష్మయ్య చేతిలో పెట్టాడు.
అతని నిజాయితీకి లక్ష్మయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇటువంటి మనిషి డబ్బు తాను కాజేశాడు !
నేనే ఆ డబ్బు మీ మూటలో ఉంచాను. మీ పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదు. ఈ డబ్బు మీరు ఉంచుకోండి." అన్నాడు లక్ష్మయ్య.
రామయ్య నవ్వి, "పరాయి సొత్తు నా ఆరోవేలు వంటిది - ఎందుకూ పనికి రాదు! అది తింటే అరగదు! దాంతో కొన్న ఇంట్లో సుఖం ఉండదు! బట్ట కొంటే దానికి అందం ఉండదు! అది నాకు వద్దు. నా కష్టార్జితం నాకు చాలు.'' అన్నాడు.
లక్ష్మయ్య ఇక ఉండ బట్టలేక, తాను పెట్టె దొంగతనం చేసిన కథ అంతా రామయ్యకు చెప్పేసి. "క్షమించాలి! నా సంపద అంతా మీదే! ఇది మీకు పరాయిసొత్తు కానేకాదు," అన్నాడు.
రామయ్య కొంచెం ఆశ్చర్యపడి. ''ఆ రోజు ఆ వాగు దగ్గిర స్నానం చేసినది నేనే. కాని ఆ పెట్టె నాది కాదు. అసలు నేనా పెట్టెను చూడనైనా లేదు. ఆ పెట్టె గలవాణ్ణి ఏ పులి అయినా ఎత్తుకు పోయిందో ఏమో! అది మీకు దొరికింది. నాకు సెలవిప్పించండి, చాలా దూరం వెళ్ళాలి!" అంటూ వెళ్ళిపోయాడు.
రామయ్య మాటలు లక్ష్మయ్య చెవిలో కంగున మోగుతూనే ఉన్నాయి. అందులో నిజం కూడా ఉన్నట్టు అనిపించింది. తనకు ఈ ఇంట్లో సుఖం లేదు. తిన్నది రుచించదు. తనకు అజీర్తిరోగం! తన స్థూలశరీరం వికారంగా ఉన్నమాట కూడా నిజమే.
సమయానికి మంగమ్మ ఇంట లేనందుకు లక్ష్మయ్య సంతోషించాడు. అతను అటక మీది నుంచి తనకు దొరికిన పెట్టెను దించి, దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి, గ్రామాధికారికి ఇచ్చి, "దీన్ని ప్రజాసౌకర్యాలకు వినియోగించండి.'' అని చెప్పి, ఇంటికి తిరిగి వచ్చాడు.
-మాచిరాజు కామేశ్వరరావు
పరాయిసొత్తు అనే ఈ తెలుగు నీతి కథలో లక్ష్మయ్య దొంగతనం చేసిన సంపద, రామయ్య నిజాయితీ ద్వారా ఎలా మారుతుందో తెలుసుకోండి. కుటుంబం, డబ్బు, నిజాయితీ విలువలపై ఆధారిత ఈ కథ పిల్లలకు, పెద్దలకు కూడా స్ఫూర్తినిస్తుంది.
పరాయిసొత్తు కథ, తెలుగు నీతి కథలు, Telugu moral stories, పరాయి సొత్తు అర్థం, తెలుగు కథలు నిజాయితీ, machiraju kameswara rao stories, Telugu short stories with moral, honesty story in Telugu, తెలుగు లో కథలు
#పరాయిసొత్తు #TeluguMoralStories #తెలుగుకథలు #HonestyStory #TeluguStories #నీతికథలు #MachirajuKameswaraRao #TeluguLiterature #InspirationalStories #తెలుగుసాహిత్యం
మరిన్ని కథల కోసం follow చేయండి.
Post a Comment